ఫోర్డ్‌... రివర్స్‌గేర్‌!

10 Sep, 2021 00:06 IST|Sakshi

భారత్‌కు కంపెనీ గుడ్‌బై...నష్టాల కారణంగా ప్లాంట్ల మూసివేతకు  నిర్ణయం

ఎకో స్పోర్ట్, ఫిగో, అసై్పర్‌ అమ్మకాలకు బ్రేక్‌

విదేశీ మోడళ్లు మాత్రమే విక్రయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న యూఎస్‌ కంపెనీ ఫోర్డ్‌ మోటార్‌ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోంది. అలాగే ఎకో స్పోర్ట్, ఫిగో, అసై్పర్‌ మోడళ్ల అమ్మకాలకు స్వస్తి పలకనుంది. ముస్టాంగ్‌ కూపే, మ్యాచ్‌–ఈ వంటి దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే ఇక్కడ విక్రయించనున్నట్టు గురువారం ప్రకటించింది. పునరి్నర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సరీ్వస్, విడి భాగాలు, వారంటీ కవరేజ్‌ కోసం పూర్తి కస్టమర్‌ సపోర్ట్‌ కార్యకలాపాలను కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. గుజరాత్‌ సనంద్‌లోని అసెంబ్లింగ్‌ సెంటర్‌ను ఈ ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య, చెన్నైలోని వాహనాలు, ఇంజన్ల తయారీ కేంద్రాన్ని 2022 ఏప్రిల్‌–జూన్‌ కాలంలో మూసివేస్తామని కంపెనీ వెల్లడించింది. అమెరికా వాహన కంపెనీల్లో భారత్‌లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్‌ మోటార్స్‌ కాగా రెండోది ఫోర్డ్‌ కానుంది.  

విలువను సృష్టించడానికి..
‘ఫోర్డ్‌ ప్లస్‌ ప్రణాళికలో భాగంగా స్థిర, లాభదాయక వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సరైన స్థాయిలో వృద్ధికి, విలువను సృష్టించడానికి మూలధనాన్ని కేటాయిస్తాం’ అని ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ జిమ్‌ ఫార్లే ఈ సందర్భంగా తెలిపారు. ‘డీలర్లతో కలిసి పనిచేస్తూ విలువైన కస్టమర్ల కోసం శ్రద్ధ వహిస్తాం. భారత్‌ మాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా భారీ, ముఖ్యమైన ఉద్యోగుల స్థావరంగా ఫోర్డ్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ కొనసాగుతుంది’ అని వివరించారు. ఫోర్డ్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌లో 11,000 పైచిలుకు మంది పనిచేస్తున్నారు.  

సామర్థ్యంలో 21 శాతమే..
భారత్‌లో వాహనాల తయారీలో కంపెనీ పెట్టుబడులు కొనసాగించడానికి, అందుకు తగ్గ రాబడిని అందించే మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనురాగ్‌ మెహరోత్రా అన్నారు. ‘దురదృష్టవశాత్తు మేము మార్గాన్ని చూపించలేకపోయాం. ఇప్పుడు భారతదేశంలో వ్యాపారాన్ని పునరి్నరి్మంచడం తప్ప మరో మార్గం లేదు. కొత్త ఉత్పత్తుల పరిచయం, వ్యయాలను తగ్గించడానికి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి, మహీంద్రా వంటి సంస్థలతో భాగస్వామ్యం, కాంట్రాక్ట్‌ తయారీతో సహా చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత కంపెనీ పునర్నిర్మాణ చర్య తీసుకుంది. భారత ఆటోమొబైల్‌ రంగంలో అంచనాలకు తగ్గట్టుగా వృద్ధి లేదు. మా ప్లాంట్లు స్థాపిత సామర్థ్యంలో కేవలం 21 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే మేము ఎగుమతులపై దృష్టి పెట్టాం. కానీ యూఎస్, యూరప్‌లో నిబంధనలను కఠినతరం చేయడంతో పరిమాణం పడిపోయింది. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు సహేతుక ప్యాకేజీ ఇస్తాం. ప్లాంట్ల విషయంలో కొనుగోలుదార్లతో చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

దేశంలో భారీ పెట్టుబడులు..
రెండు ప్లాంట్లపై సంస్థ రూ.18,500 కోట్లు పెట్టుబడి చేసింది. ఏటా 6,10,000 ఇంజన్లు, 4,40,000 వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకో స్పోర్ట్, ఫిగో, అస్పైర్‌ మోడళ్లు తయారవుతున్నాయి. 70 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఇక నుంచి వీటి తయారీతోపాటు విక్రయాలు సైతం భారత్‌లో నిలిచిపోనున్నాయి.
గత 10 ఏళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు రూ.14,800 కోట్లు పేరుకుపోయాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు చేసినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా కార్లకు డిమాండ్‌ లేకపోవడం సమస్యను తీవ్రం చేసింది. కంపెనీ నిర్ణయం 4,000 మంది ఉద్యోగులతోపాటు 300 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న 150 డీలర్‌íÙప్స్‌ ప్రిన్సిపల్స్‌పైన పడనుంది.

డీలర్లకు షాక్‌...
రూ.2,000 కోట్ల పెట్టుబడులపై ప్రభావం
‘ఫోర్డ్‌ డీలర్లు రూ.2,000 కోట్లకుపైగా పెట్టుబడి చేశారు. కంపెనీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 40,000 పైచిలుకు ఉద్యోగులు ఈ డీలర్ల వద్ద పనిచేస్తున్నట్టు వివరించింది. రూ.150 కోట్ల విలువైన 1,000 వాహనాలు వీరి వద్ద నిల్వ ఉన్నట్టు ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ వింకేశ్‌ గులాటీ వెల్లడించారు. ‘డెమో వెహికిల్స్‌ సైతం డీలర్ల వద్ద ఉన్నాయి. అయిదు నెలల క్రితం వరకు కూడా డీలర్లను కంపెనీ నియమించుకుంది. ఇటువంటి డీలర్లు భారీగా నష్టపోతారు. ఫ్రాంచైజీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలి. పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని ప్రతిపాదించింది కూడా. 2017 నుంచి భారత మార్కెట్లో జనరల్‌ మోటార్స్, మ్యాన్‌ ట్రక్స్, హార్లే డేవిడ్సన్, యూఎం లోహియా.. తాజాగా ఫోర్డ్‌ ఇండియా బోర్డ్‌ తిప్పేసింది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు