ధన్యవాదాలు.. కానీ మేము ఆ పని ఇక్కడ చేయలేం..

12 May, 2022 13:59 IST|Sakshi

ఇండియాకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదంటూ మరోసారి స్పష్టం చేసింది దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్డ్‌. అమెరికాకు చెందిన ఫోర్డ్‌ ఇండియాలో తమ ఆపరేషన్స్‌ని పునఃప్రారంభించేది లేదని మరోసారి స్పష్టం చేసింది.

అప్పుడే గుడ్‌బై
కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ ఇండియాలో తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్టు 2021 సెప్టెంబరులో ప్రకటించింది. ఇక్కడ మార్కెట్‌లో సరైన పట్టు సాధించలేకపోయిన కారణంగా ఇండియా నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే అప్పటికే ఫోర్డ్‌కు ఇండియాలో గుజరాత్‌, తమిళనాడులో రెండు పెద్ద కార్ల తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి.

రీ ఎంట్రీ
ఫోర్డ్‌ నుంచి నిష్క్రమణ ప్రకటన వెలువడినా.. అనంతర కాలంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రకటించిన ప్రొడక‌్షన్‌ లింకెడ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌కి ఫోర్డ్‌ దరఖాస్తు చేసుకుంది. ఫోర్డ్‌ దరఖాస్తును పరిశీలించిన కేంద్రం ఈ స్కీమ్‌ అమలుకు అంగీకారం కూడా తెలిపింది. దీంతో ఫోర్డ్‌ ఏదో ఒక రూపంలో ఇండియాలోకి తిరిగి అడుగు పెడుతుందనే వార్తలు వచ్చాయి.

ఎలక్ట్రిక్‌ కార్లు
ఇండియాలో ఉన్న ఫోర్డ్‌ కార్ల తయారీ ఫ్యాక్టరీలో ఇకపై పెట్రోలు, డీజిల్‌ కార్లకు బదులు ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తారని, వాటిని ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారనే అంచనాలు వచ్చాయి. అయితే ఇండియాలో తమ ఆపరేషన్స్‌ తిరిగి ప్రారంభించే విషయంపై ఇటీవల సమీక్ష చేసిన ఫోర్డ్‌ పాత నిర్ణయానికే కట్టుబడి ఉండాలని డిసైడ్‌ అయ్యింది.

సారీ
ప్రొడక‌్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌కి ఎంపిక చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూనే తాము తిరిగి ఇండియాలో ఎటువంటి కార్ల తయారీ ప్రారంభించలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు తమకున్న కార్ల ఫ్యాక్టరీలను ఇతర సంస్థలకు అమ్మే ప్రయత్నాల్లో జోరు పెంచింది. గుజరాత్‌ ప్లాంటును కొనేందుకు టాటా గ్రూపు ఆసక్తి చూపిస్తోంది.
చదవండి: టాటా నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌.. సింగిల్‌ చార్జ్‌తో 437 కి.మీ రేంజ్‌

మరిన్ని వార్తలు