వాళ్లంతా అలా వచ్చినవారేగా! మూన్‌ లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు 

23 Sep, 2022 20:01 IST|Sakshi

సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్‌ సమస్య ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విప్రో 300మంది ఉద్యోగులపై వేటు వేసిన తరువాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్‌)ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్, ఫ్రెష్‌డెస్క్ వంటి అనేక విజయవంతమైన కంపెనీలను స్థాపించిన వారంతా అలా  ఉద్యోగాలు చేస్తూనే స్థాపించారని ఆయన పేర్కొన్నారు. (మూన్‌లైటింగ్‌: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు)

మూన్‌లైటింగ్ అనేది కొత్తగా వచ్చిందని కాదు అనేది ఐటీ కంపెనీల వ్యవస్థాపక చరిత్రను చూస్తే అర్థమవుతందని హర్‌ప్రీత్‌ తెలిపారు. ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్, జోహో వ్యవస్థాపకులు ఉద్యోగాల్లో ఉండగా అలా పనిచేసినవారే అంటూ  సలుజా కమెంట్‌ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇన్ఫోసిస్‌ను స్థాపించినప్పుడు పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌తో కలిసి పనిచేశారనీ, అదేసమయంలో, స్టార్టప్‌లను పరిశీలిస్తే ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండర్స్‌ సచిన్, బిన్నీ బన్సాల్ కూడా...వారు అమెజాన్‌లో పని చేస్తున్నప్పుడే  స్థాపించారని గుర్తు చేశారు. అలాగే గిరీష్ మాతృభూతం జోహో కార్పొరేషన్‌లో పనిచేస్తున్నప్పుడే గత సంవత్సరం నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఫ్రెష్‌డెస్క్ ను స్థాపించారన్నారు.

అంతేకాదు నిజానికి ఇన్ఫోసిస్ స్థాపనకు మూన్‌లైటింగ్‌తో దగ్గరి సంబంధాలున్నాయి. కానీ మూన్‌లైటింగ్ వ్యతిరేకంగా ఉద్యోగులను హెచ్చరిస్తోంద న్నారు. రెండు ఉద్యోగాలు  లేవు..నో మూన్‌లైటింగ్ అంటూ మెయిల్స్‌ ద్వారా ఇటీవల హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను హెచ్చరించడంపై  విమర్శించారు. కాగా ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ కూడా ఉద్యోగి తమ ఖాళీ సమయంలో చేసే పనులకు, కంపెనీకి సంబంధం ఉండదంటూ  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి:  IBM:ముదురుతున్నమూన్‌లైటింగ్‌వివాదం,ఐబీఎం కీలక వ్యాఖ్యలు

కేంద్రఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
 ఇది ఇలా ఉండగా దేశంలోని ఐటీ కంపెనీలు మూన్‌లైటింగ్‌పై  సీరియస్‌గా స్పందిస్తుండగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉద్యోగులకు అనుకూలంగా శుక్రవారం ప్రకటన చేయయడం విశేషం. ఉద్యోగులను బెదిరించడం, నియంత్రించడం సరికాదని, వారి కలలను సాకారం చేసుకునేందుకు అనుమతించాలని ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. మూన్‌లైటింగ్‌ పై మొట్ట మొదటి సారిగా ఒక కేంద్ర మంత్రి ప్రకటన చేయటం సంచలనంగా మారింది. ఈ తరం యువతీయువకులు సొంత నైపుణ్యాలపై ఎక్కువ డబ్బు ఆర్జించాలని, మరింత వ్యాల్యూ  సృష్టించాలని కోరుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులను తగ్గించాలని వారి స్వంత స్టార్టప్‌లో పని చేయకూడదని చెప్పే సంస్థల ప్రయత్నాలు విఫలమవుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు