చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్‌లో ఫాక్స్‌కాన్‌ 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

3 Mar, 2023 11:07 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ సంస్థ చైనాను విడిచేసేందుకు సిద్ధమైంది. భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థ సుమారు 700 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అమెరికా-చైనా మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పై బెలూన్‌ కూల్చేవేతతో అమెరికాపై చైనా మండిపడుతుంటే .. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యాకు సాయం చేస్తే చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా రెడీ అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వివాదం తమ వ్యాపారానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని పలు దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. అందుకే చైనాలో ఉండి వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. 

చైనాలో ఉంటే అన్నీ ఆటంకాలే
ఈ తరుణంలో చైనాలో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు దిగ్గజ కంపెనీలు డ్రాగన్‌ కంట్రీని విడిచి పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వరల్డ్‌ లార్జెస్ట్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ సంస్థగా ఫాక్స్‌గాన్‌కు పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. చైనాలో పరిస్థితులు, ఇతర దేశాలతో వైరం కారణంగా ఆ సంస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడమే గాక.. భారీగా నష్టాల్ని మూటగట్టుకుంటుంది. 

అందుకే చైనా నుంచి మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను భారత్‌కు తరలించాలని చూస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఎయిర్‌ పోర్ట్‌ సమీప ప్రాంతంలో 300 ఎకరాల్లో ఐఫోన్‌ విడి భాగాల తయారీ యూనిట్‌ను నెలకొల్పే యోచనలో ఉందంటూ ఎకనమిక్స్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. 

లక్షమందికి ఉపాధి
యాపిల్‌తో పాటు ఇతర అమెరికన్‌ బ్రాండ్‌లు చైనాకు గుడ్‌బై చెప్పి ప్రత్యామ్నాయంగా ఉన్న భారత్‌తో పాటు ఏసియన్‌ కంట్రీ వియాత్నంలలో తన కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక భారత్‌లో ఫాక్స్‌కాన్‌ నెలకొల్పబోయే తయారీ యూనిట్ కారణంగా లక్ష మంది ఉపాధి కలగనుంది. ప్రస్తుతం ఆ సంస్థ చైనా నగరం జెంగ్‌జౌ ఫాక్స్‌కాన్‌కు చెందిన ఐఫోన్‌ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..ప్రత్యేక సందర్భంగాల్లో తయారీని పెంచేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. 

పునరాలోచనలో యాపిల్‌
ప్రస్తుతం వైరస్‌ విజృంభణతో కోవిడ్‌-19 ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. దీంతో జెంగ్‌ జౌ ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ తయారీలో ఉద్యోగులు సెలవులో ఉండగా.. చైనాలో ఐఫోన్‌లను తయారు చేసే విషయంలో యాపిల్‌ పునఃపరిశీలిస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.యాపిల్‌ నిర్ణయానికి కొనసాగింపుగానే ఐఫోన్‌ల తయారీ సంస్థ  ఫాక్స్‌కాన్‌ ఎంత వీలైతే అంత తొందరుగా భారత్‌లో ప‍్లాంట్‌ నెలకొల్పనున్నట్లు సమాచారం. 

కాగా, ఫాక్సాకాన్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించే విషయంలో ఇప్పటి వరకు ఆ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ఫాక్సాకాన్‌, యాపిల్‌ తోపాటు ఇటు కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్ల తయారీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు