భారత్‌లో గ్యాలెరీ లాఫయేట్‌

18 Nov, 2022 08:26 IST|Sakshi

పరిచయం చేయనున్న ఆదిత్య బిర్లా 

తొలుత ముంబై, ఢిల్లీ లో ఔట్‌లెట్లు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌ కంపెనీ, ఫ్రాన్స్‌కు చెందిన గ్యాలెరీ లాఫయేట్‌ భారత్‌లో అడుగుపెడుతోంది. లగ్జరీ డిపార్ట్‌మెంట్‌ స్టోర్లతోపాటు ఈ–కామర్స్‌ వేదిక ద్వారా దేశీయంగా ఉత్పత్తులను విక్రయించనుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్‌ ఈ మేరకు గ్యాలెరీ లఫయట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలి ఔట్‌లెట్‌ 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముంబైలో 2024లో, రెండవ స్టోర్‌ 65,000 చదరపు అడుగుల్లో ఢిల్లీలో 2025లో ప్రారంభం కానుంది.

200లకుపైగా బ్రాండ్స్‌కు చెందిన ఖరీదైన ఫ్యాషన్, యాక్సెసరీస్, ఫుడ్, అలంకరణ, కళాఖండాలను ఇక్కడ విక్రయిస్తారు. భవిష్యత్‌లో లగ్జరీ బ్రాండ్‌ల వృద్ధి కేంద్రంగా, ప్రపంచ విలాసవంతమైన మార్కెట్‌గా భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్‌ ఎండీ ఆశిష్‌ దీక్షిత్‌ తెలిపారు. ‘భారత్‌ వంటి ప్రతిష్టాత్మక, పరిణతి చెందిన మార్కెట్‌లో విస్తరించడం గర్వకారణం. ఇక్కడ మా బ్రాండ్‌ ప్రయోజ నం పొందగలదని బలంగా విశ్వసిస్తున్నాము. 2025 నాటికి విదేశాల్లో 20 స్టోర్లను చేరుకోవాలనే మా ఆశయానికి ఇది నాంది’ అని గ్యాలెరీ లాఫ యేట్‌ సీఈవో నికోలస్‌ హౌజ్‌ వివరించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన గ్యాలెరీ లాఫయేట్‌ ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాల్లో 65 కేంద్రాలను నిర్వహిస్తోంది.

చదవండి: అమలులోకి కొత్త రూల్‌.. ఆ సమయంలో ఎస్‌ఎంఎస్‌ సేవలు బంద్‌!

మరిన్ని వార్తలు