ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!

20 Sep, 2021 14:56 IST|Sakshi

దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు కొద్ది రోజుల నుంచి దేశంలో భారీగా నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫ్రెంచ్ టెక్నాలజీ కంపెనీ అటోస్ వచ్చి చేరింది. అటోస్ ఐటీ కంపెనీ రాబోయే 12 నెలల్లో భారతదేశంలో సుమారు 15,000 మందిని నియమించుకొనున్నట్లు తెలిపింది. ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ సేవల్లో నెం.1గా నిలవడానికి దేశంలో కొత్తగా నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలీ గిరార్డ్ ఎకనామిక్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

దేశంలో డిజిటైజేషన్ కారణంగా భారీగా ఉద్యోగుల అవసరం ఏర్పడినట్లు గిరార్డ్ అన్నారు. ప్రభుత్వ రంగం, డిఫెన్స్ తో సహా ఇతర రంగాలలో భారీగా డిమాండ్ ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ నైపుణ్యాలు గల మానవ వనరులు కలిగిన దేశాలలో భారత దేశం ఒకటి, అయితే ప్రస్తుతం డిమాండ్  సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉన్నట్లు ఆయన అన్నారు. భారతదేశంలో ఏటా సంస్థ ఉద్యోగుల సంబంధిత ఖర్చులపై 400 మిలియన్ల యూరోలు పెట్టుబడి పెడుతోంది. ఫ్రెంచ్ సంస్థ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో ప్రభుత్వంతో ఈ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్మడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్‌!)

అధిక పనితీరు కలిగిన కంప్యూటర్లను అసెంబ్లీ చేయడం, టెస్టింగ్ చేయడంపై కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టినట్లు గిరార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో దాదాపు మూడో వంతు భారత దేశం నుంచి వస్తున్నట్లు ఎలీ గిరార్డ్ చెప్పారు. "భారతదేశంలో మాకు క్వాంటం ల్యాబ్ ఉంది. దేశంలో అద్భుతమైన డిజిటల్ శక్తిని బట్టి భారతదేశం రాబోయే కాలంలో క్వాంటంలో నాయకత్వం వహించగలదని నేను అనుకుంటున్నాను" అని ఆయన అన్నారు. 5జీ టెక్నాలజీ వంటి తర్వాతి తరం టెక్నాలజీలు కొత్త అవకాశాలు సృష్టించవచ్చు అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు