Future Group: రిలయన్స్‌తో ఒప్పందంపై ఫ్యూచర్‌కు ఊరట!

29 Sep, 2021 08:55 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌కు తన గ్రూప్‌ సంస్థల విక్రయానికి సంబంధించి కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ  సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) మంగళవారం కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌కు అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. 

ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల విలీన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుచిత్ర కనుపర్తి, చంద్రభన్‌సింగ్‌ లతో కూడిన ఇరువురు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ తోసిపుచ్చినట్లు సమాచారం.అయితే ఈ వార్తలపై పంపిన ఈమెయిల్స్‌కు అటు అమెజాన్‌కానీ, ఇటు ఫ్యూచర్‌కానీ సమాధానం ఇవ్వలేదు. 

అమెజాన్‌కు తక్షణం నష్టం లేదు 
సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్‌ జరిపే ఈజీఎం గ్రూప్‌ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్‌కు ఎన్‌సీఎల్‌టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్‌ ఎన్‌సీఎల్‌టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. 

అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్‌ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్‌కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్‌ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందితే, ‘తరువాత ఆర్ర్‌బిట్రేషన్‌ పక్రియలో విజయం సాదిస్తే’ రిలయన్స్‌తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది.   

సుదీర్ఘ న్యాయ వివాదం 
రిలయన్స్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్‌ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్‌ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్‌ వాదన. 

మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్‌ తదితర వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు లీగల్‌ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్‌ బెంచ్‌ స్టే విధించింది. 

ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్‌ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం  ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి.

చదవండి: అమెజాన్‌ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్‌ఆర్‌ఎల్‌

మరిన్ని వార్తలు