క్యూ1లో గెయిల్‌ దూకుడు

6 Aug, 2021 01:07 IST|Sakshi

నికర లాభం రూ. 1,530 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 500 శాతం దూసుకెళ్లి రూ. 1,530 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ1లో దాదాపు రూ. 256 కోట్లు మాత్రమే ఆర్జించింది. కోవిడ్‌–19 కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు కారణంగా గత క్యూ1లో కార్యకలాపాలకు విఘాతం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. అయితే తాజా క్వార్టర్‌లోనూ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తలెత్తినప్పటికీ తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని తెలియజేసింది.  మొత్తం ఆదాయం సైతం 44 శాతం జంప్‌చేసి రూ. 17,387 కోట్లను తాకింది.

లాభాల తీరిలా
సొంత పైప్‌లైన్ల ద్వారా గ్యాస్‌ రవాణా పెరగడంతో ఈ విభాగం నుంచి లాభదాయకత 27 శాతం పుంజుకుని రూ. 915 కోట్లకు చేరినట్లు వివరించింది. కాగా.. గ్యాస్‌పై మార్జిన్లు బలపడటంతో రూ. 378 కోట్లు ఆర్జించింది. గత క్యూ1లో రూ. 545 కోట్లకుపైగా నష్టాలు వాటిల్లాయి. ఇక పెట్రోకెమికల్‌ బిజినెస్‌ సైతం రూ. 138 కోట్ల లాభం సాధించగా.. గతంలో రూ. 154 కోట్ల నష్టం నమోదైంది. భాగస్వామ్య సంస్థలతో కలసి 8,000 కిలోమీటర్ల పైప్‌లైన్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 38,000 కోట్లవరకూ వెచ్చిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉసార్‌లో పీడీహెచ్‌పీపీ యూనిట్‌ ద్వారా పాలీప్రొపిలీన్‌ సామర్థ్యాన్ని 5,00,000 టన్నులమేర విస్తరిస్తోంది. ఇదేవిధంగా యూపీలోని పాటాలో 60,000 పీపీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 10,000 కోట్ల పె ట్టుబడులను కేటాయించింది. మొత్తం పెట్టుబడు ల్లో ఈ ఏడాది రూ. 6,600 కోట్లు సమకూర్చనుంది.
ఫలితాల నేపథ్యంలో గెయిల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు యథాతథంగా రూ. 143 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు