అదానీకి హిండెన్‌బర్గ్ షాక్‌, మరో బిలియనీర్‌ సంచలన వ్యాఖ్యలు

27 Jan, 2023 18:06 IST|Sakshi

సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ సృష్టించిన అలజడితో అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. తాజా  డేటా  ప్రకారం ఆసియా,  భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్- గౌతం అదానీ సంపద శుక్రవారం మరింత పతన మైంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అతని ర్యాంకింగ్ శుక్రవారం ఏడో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని మొదటి ఐదుగురు సంపన్నుల  జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు.

100 బిలియన్‌ డాలర్ల దిగువకు
ఫోర్బ్స్ రియల్ టైమ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపద రోజులో 22.5 బిలియన్ల డాలర్లకు పైగా  క్షీణించి  96.8 బిలియన్ల డాలర్లకు చేరింది. ఫలితంగా  అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే దిగువ స్థానంలో ఉన్నారు. అదానీ  షేర్ల భారీ ర్యాలీతో మొదట 2వ స్థానానికి చేరుకున్నారు గౌతం అదానీ. ఆ తరువాత చాలా కాలం పాటు 3వ స్థానంలో కొనసాగి, ఇటీవల నాలుగోప్లేస్‌కు  దిగజారిన సంగతి తెలిసిందే.

బిల్‌ అక్‌మాన్‌ వ్యాఖ్యలు
అదానీ గ్రూప్ అవకతవకలపై  అమెరికా షార్ట్ సెల్లర్  సంస్థ హింబెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై బిలియనీర్‌, అమెరికాకు చెందిన  ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్‌ అక్‌మాన్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక "అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడింది" అంటూ  బిల్ అక్‌మాన్ ట్వీట్ చేశారు.  హిండెన్‌బర్గ్  ఫారెన్సిక్ రీసెర్చ్ పూర్తి రిపోర్ట్ ఆధారంగానే, తప్ప తామెలాంటి  ఇండిపెండెంట్‌  పరిశోధన చేయలేదంటూ అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అదానీ కంపెనీల్లో, లేదా హెర్బా లైఫ్‌లో  తమకు ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్  భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో  అతిపెద్ద ఎఫ్‌పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌) కు  ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రావడం గమనార్హం. నేటినుంచి( జనవరి 27)  31 వరకు  నిర్వహించే  ఎఫ్‌పీవోలో  రూ.20 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. రూ. 3.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ఉన్న అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌  ఆఫర్‌ ప్రైస్‌ను  ధరను రూ.3,112 నుంచి రూ.3,276గా నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు