మెరిసిన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు

25 Apr, 2022 06:03 IST|Sakshi

2021–22లో 56 శాతం అప్‌

విలువలో 39 బిలియన్‌ డాలర్లు

జీజేఈపీసీ ప్రకటన  

ముంబై: భారత్‌ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారీగా 56 శాతం పురోగమించాయి. విలువలో ఈ పరిమాణం 39 బిలియన్‌ డాలర్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 25.40 బిలియన్‌ డాలర్లు. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► 2021–22 మార్చిలో స్థూలంగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 3,393.29 మిలియన్‌ డాల ర్లు. 2020–21 ఇదే నెల్లో ఈ విలువ 3,409.07 మిలియన్‌ డాలర్లు. అంటే స్వల్పంగా 0.46 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట.  
► గడచిన ఆర్థిక సంవత్సరం దేశం మొత్తం ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చురుకోగా ఇందులో 10వ వంతు సహకారం, రత్నాలు, ఆభరణాల రంగానికి కావడం హర్షణీయం.  
► మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతులలో కట్‌ అండ్‌ పాలిష్‌ చేసిన డైమండ్స్‌ సెగ్మెంట్‌ భారీగా 62 శాతం వాటాను పొందింది. అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), బెల్జియం, ఇజ్రాయెల్‌ నుండి బలమైన డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది.
► యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో ఇటీవల వాణిజ్య ఒప్పందాలపై భారత్‌ సంతకం చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. దీనివల్ల ఈ కీలకమైన వృద్ధి మార్కెట్ల మంచి అవకాశాలను పొందడానికి ఈ రంగం సిద్ధమవుతుంది. ఆయా దేశాల్లో డిమాండ్‌లో తగిన ప్రాధాన్యతను పొందేందుకు సిద్ధంగా ఉంది.  
► 2021–22లో అన్ని రకాల స్టడెడ్‌ బంగారు ఆభరణాల  షిప్‌మెంట్‌లు అంతకుముందు సంవత్సరంలో  2,768.97 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే 95 శాతం వృద్ధిని సాధించి  5,352.52 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.
► 2021–22లో వెండి ఆభరణాల స్థూల
ఎగుమతులు 2,721.87 మిలియన్‌ డాలర్లు. 2020–21లో ఈ విలువ  2336.82 మిలియన్‌ డాలర్లు.   
► రత్నాల స్థూల ఎగుమతుల 2021–22లో 66.82 శాతం వృద్ధితో 311.41 మిలియన్‌ డాలర్లకు చేరాయి. 2020–21లో ఈ విలువ 188.66 మిలియన్‌ డాలర్లు.
 

లక్ష్యంలో భాగస్వామ్యం
గ్లోబల్‌ మార్కెట్లకు భారతదేశం ఎగుమతులు 56 శాతం పుంజుకున్నాయి. ఇది ఈ రంగానికి శుభ పరిణామం. కో విడ్‌ లాక్‌డౌన్‌ సడలింపులు, మంచి డిమాండ్, అనిశ్చిత వ్యాపార వాతావరణ పరిస్థితి ఉపశమనానికి ప్రభుత్వ చర్యలు ఈ రంగం ఎగుమతులు పురోగమించడానికి కారణం. ప్రభుత్వ 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నెరవేర్చడంలో మా పరిశ్రమ పెద్ద ఎత్తున దోహదపడింది. కొన్ని అదనపు అవసరమైన విధాన మద్దతు చర్యలు పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి.     – కోలిన్‌ షా, జీజేఈపీసీ చైర్మన్‌  

>
మరిన్ని వార్తలు