ఈవీ యాక‌్షన్‌ ప్లాన్‌.. సిటీలో ప్రతీ 3 కి.మీలకు ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌

23 Jun, 2022 15:25 IST|Sakshi

నగరంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను మరింతగా ప్రోత్సహించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, తెలంగాణ సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ  (టీఎస్‌ఆర్‌ఈడీసీఓ)లు సంయుక్త కార్యచరణ ప్రకటించాయి. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ప్రతీ మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పాలనే ప్రణాళికతో ఉన్నారు.

నగరంలో ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో 150 వరకు ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పెట్రోలు బంకులు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో విస్తరించి ఉన్నాయి. వీటికి అదనంగా మరో 300ల వరకు ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు నిర్మించనున్నారు. ఒక్క ఛార్జింగ్‌ స్టేషన్‌ను 18 కిలోవాట్‌ పవర్‌ పర్‌ అవర్‌ కెపాసిటీతో నిర్మించనున్నారు. వీటిని రెవెన్యూ షేరింగ్‌ పద్దతిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 

ఇప్పటికే ఇందిరాపార్క్‌, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌ నంబర్‌ 1, 3, 6, ట్యాంక్‌బండ్‌ రోడ్‌, మున్సిపల్‌ పార్కింగ్‌ ఏరియా అబిడ్స్‌, నానక్‌రామ్‌గూడ, మహావీర్‌ హారిని వనస్థలి నేషనల్‌ పార్క్‌,  ఉప్పల్‌ మెట్రో పార్కింగ్‌ ఏరియా, ఓవైసీ హాస్పిటల్‌ సంతోశ్‌నగర్‌, తాజ్‌ హోటల్‌ సరోజినిదేవీ రోడ్‌ తదితర ప్రాంతాలు ఎంపికయ్యాయి. ఒకసారి లొకేషన్‌ ఫైనల్‌ అయ్యాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

చదవండి: షాకింగ్‌ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్‌ ఈవీ, స్పందించిన సంస్థ

మరిన్ని వార్తలు