భారత్‌కు రెమిటెన్సుల్లో మహిళలే టాప్‌

10 Nov, 2020 05:28 IST|Sakshi

చెల్లింపుల తీరుపై వరల్డ్‌రెమిట్‌ నివేదిక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విదేశాల నుంచి భారత్‌లోని బంధువులకు, స్నేహితులకు నగదు చెల్లింపుల్లో (రెమిటెన్సులు) మహిళలూ ముందున్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ వరల్డ్‌రెమిట్‌ వేదికగా 2015 సెప్టెంబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌ఏ నుంచి భారత్‌కు వచ్చిన రెమిటెన్సుల ప్రకారం.. మొత్తం చెల్లింపుల్లో భారతీయ మహిళలు పంపినవి ఆస్ట్రేలియాలో 18 నుంచి 26 శాతానికి, యూకేలో 21 నుంచి 32 శాతానికి పెరిగాయి. యూఎస్‌ఏ విషయంలో ఇది 25 నుంచి 24 శాతానికి వచ్చింది. ఆస్ట్రేలియా, యూకేల్లో సేవల రంగం విస్తృతి ఈ పెరుగుదలకు కారణం కావొచ్చు.

ఆస్ట్రేలియాలో మొత్తం ఉద్యోగుల్లో సేవల రంగం వాటా అత్యధికంగా 87 శాతం ఉంది. యూఎస్‌ఏ, యూకే నుంచి భారత్‌కు నగదు పంపుతున్న మహిళల్లో 35, ఆపైన వయసున్న వారు అధికంగా ఉన్నారు. ఆస్ట్రేలియా విషయంలో 25–30 ఏళ్ల వయసున్న వారు ఎక్కువ. పరిమాణం పరంగా యూఎస్‌ఏ నుంచి భారత్‌కు అత్యధికంగా హైదరాబాద్‌కు చెల్లింపులు జరుగుతున్నాయి. లుధియానా, అమృత్‌సర్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వరల్డ్‌రెమిట్‌ దక్షిణాసియా డైరెక్టర్‌ రుజాన్‌ అహ్మద్‌ తెలిపారు. భారత్‌కు నగదు పంపుతున్న టాప్‌–10 దేశాల వాటా ఏటా రూ.5.81 లక్షల కోట్లు అని చెప్పారు. అత్యధికంగా నగదును స్వీకరిస్తున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో ఉందన్నారు.   

>
మరిన్ని వార్తలు