7 శాతం కంపెనీల్లోనే ‘వృద్ధి’ సామర్థ్యాలు

9 Mar, 2023 03:56 IST|Sakshi

ఇన్ఫోసిస్‌ నాలెడ్జ్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక

న్యూఢిల్లీ: డిజిటల్‌ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్‌ నాలెడ్జ్‌ ఇనిస్టిట్యూట్‌ తెలిపింది. అంటే 93 శాతం కంపెనీల్లో ఈ సామర్థ్యాలు లేవని తేల్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, భారత్‌లోని 2,700 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది.

అధిక నాణ్యత, పారదర్శక డేటా, బాధ్యతాయుతంగా రిస్క్‌ తీసుకునే సంస్కృతి అన్నవి కష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీలు లాభాల్లో వృద్ధిని నమోదు చేయడానికి తోడ్పడుతున్న అంశాలుగా ఈ నివేదిక పేర్కొంది. నూతన ఉత్పత్తులను వేగంగా మార్కెట్‌కు తీసుకురావడం అన్నది ముఖ్యమని, ఇది మొదటగా ప్రవేశించిన అనుకూలతలు తెస్తుందని తెలిపింది. ‘‘విజయానికి మూడు భిన్నమైన అంశాలు తోడ్పడతాయి. డేటాను అంతర్గతంగా వినియోగించడం, బాధ్యతాయుతంగా రిస్క్‌ తీసుకునే సంస్కృతిని ఏర్పాటు చేయడం, డిజిటల్‌ వృద్ధిని అందిపుచ్చుకునే సంస్థాగత నిర్మాణం అవసరం’’అని ఈ నివేదిక వివరించింది.

మరిన్ని వార్తలు