గ్రాన్యూల్స్‌పై పీఈ దిగ్గజాల కన్ను!

25 Sep, 2020 11:35 IST|Sakshi

హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ కొనుగోలుకి ఆసక్తి

జాబితాలో కేకేఆర్‌, బెయిన్‌ క్యాపిటల్‌, బ్లాక్‌స్టోన్‌

9 శాతం దూసుకెళ్లిన గ్రాన్యూల్స్‌ ఇండియా

తొలుత రూ. 395 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకిన షేరు

ఫార్మా రంగ హైదరాబాద్‌ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి గ్లోబల్‌ పీఈ సంస్థలు కేకేఆర్‌, బెయిన్‌ క్యాపిటల్‌, బ్లాక్‌స్టోన్‌ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీఐ, కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ గ్రాన్సూల్స్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు పీఈ దిగ్గజాలు ప్రాథమిక ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ మూడు పీఈ దిగ్గజాలూ నాన్‌బైండింగ్‌ బిడ్స్‌ను దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీలో మెజారిటీ వాటా విక్రయం కోసం గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రమోటర్లు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలు చూద్దాం..

షేరు జూమ్‌
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా కౌంటర్‌కు తాజాగా డిమాండ్‌ కనిపిస్తోంది. ఎన్‌ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.4 శాతం దూసుకెళ్లి రూ. 395ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 375 వద్ద ట్రేడవుతోంది. కాగా.. పారాసెట్మల్‌ ఔషధ తయారీలో ప్రపంచస్థాయి కంపెనీగా గ్రాన్యూల్స్‌ నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో ఈ ఏడాది క్యూ1లో కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు మెట్‌ఫార్మిన్‌, పారాసెట్మల్‌, ఇబుప్రోఫిన్‌ వంటి ఔషధాలకు ఏర్పడిన డిమాండ్‌ కారణమైనట్లు పేర్కొన్నారు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 42.13 శాతం వాటాను కలిగి ఉన్నారు. గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కోసం పీఈ దిగ్గజాల మధ్య పోటీ నెలకొనే వీలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే గ్రాన్యూల్స్‌ కంపెనీ ప్రతినిధి ఈ అంశాలపై స్పందిస్తూ.. మార్కెట్‌ అంచనాలపై మాట్లాడబోమన్నారు. అవసరమైనప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారాన్ని అందించగలమని స్పష్టం చేశారు. 

పీఈ హవా
ముంబై ఫార్మా కంపెనీ జేబీ కెమికల్స్‌లో 54 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు 2020 జులైలో పీఈ దిగ్గజం కేకేఆర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 3,100 కోట్లను వెచ్చించనుంది. ఐపీవో యోచనను వాయిదా వేసిన పుణే కంపెనీ ఎమ్‌క్యూర్‌ ఫార్మాలో గతంలోనే బెయిన్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క దేశీయంగా రియల్టీ రంగంలో బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌ పలు వాణిజ్య ప్రాజెక్టులను కలిగి ఉంది. వెరసి పీఈ కంపెనీలు దేశీ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

 

మరిన్ని వార్తలు