2020లో తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

24 Feb, 2021 18:28 IST|Sakshi

2020 నాల్గవ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 5.4% తగ్గాయని గార్ట్‌నర్ కొత్త నివేదిక తెలిపింది. 2020 ఏడాది మొత్తంలో అమ్మకాలు కరోనా కారణంగా 12.5శాతం ​​తగ్గాయి. నాల్గవ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విషయంలో 20.8 శాతం వాటాతో ఆపిల్ అగ్ర స్థానంలో ఉంది. గార్ట్నర్ ప్రకారం.. మన దేశంలో అక్టోబర్ 23న విడుదలైన ఆపిల్ 12 సిరీస్ 5జీ ఐఫోన్ లు నాల్గవ త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్​ దిగ్గజం శామ్‌సంగ్ 16.2 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన షియోమీ, ఒప్పో, హువావే వరుసగా మూడవ, నాల్గవ మరియు ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి.

 "2020 నాలుగో త్రైమాసికంలో 5జి స్మార్ట్‌ఫోన్‌లు, లోయర్-టు-మిడ్-టైర్ స్మార్ట్‌ఫోన్ల రాకతో గ్లోబల్​ మార్కెట్​లో అమ్మకాల క్షీణత కొంతమేర తగ్గింది" అని గార్ట్‌నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా అన్నారు. కరోనా కారణంగా వినియోగదారులు తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. మార్కెట్​లోకి కొత్తగా విడుదలైన 5జీ స్మార్ట్‌ఫోన్‌లు, ప్రో-కెమెరా ఫీచర్లు కొంతమంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఆపిల్ నాల్గవ త్రైమాసికంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ 2020 ఏడాది మొత్తం అమ్మకాలలో శామ్‌సంగ్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది పోలిస్తే 2020లో శామ్‌సంగ్ 14.6శాతం క్షీణతను నమోదు చేసింది. గ్లోబల్​ స్మార్ట్​ఫోన్ల అమ్మకాల్లో క్షీణత భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) ప్రకారం.. 2020లో కరోనా కారణంగా భారత్​లో మొబైల్​ ఎగుమతులు 2శాతం మేర తగ్గాయని తెలిపింది. 2009 తరువాత భారత్​లో మొబైల్ అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి.

చదవండి:

ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ను చూశారా!

మరిన్ని వార్తలు