Gloster: తెలంగాణలో జూట్‌ మిల్లు, ప్రభుత్వంతో గ్లోస్టర్‌ సంస్థ ఒప్పందం

20 Sep, 2021 10:24 IST|Sakshi

కోల్‌కతా: Gloster Limited signs MoU.జూట్‌ తయారీ కంపెనీ గ్లోస్టర్‌ లిమిటెడ్‌ పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో కొత్తగా జూట్‌ మిల్లులను ఏర్పాటు చేయనుట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023)కల్లా రూ. 630 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హేమంత్‌ బంగూర్‌ తాజాగా వెల్లడించారు. 

ఈ నిధులతో రెండు రాష్ట్రాలలోనూ జూట్‌ మిల్లులను నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. తద్వారా కంపెనీ ఆదాయం 150 శాతం పుంజుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో జనపనార(జూట్‌) ఉత్పత్తి తగ్గుతుండటం, పలు మిల్లులు ఆధునికతకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వంటి అంశాల నేపథ్యంలో పర్యావరణ అనుకూలమైన ఫైబర్‌కు డిమాండ్‌ పట్ల బంగూర్‌ ఆశావహంగా స్పందించారు. 

ఇప్పటికే కొత్త ప్లాంటు ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో మరింత విస్తరించనున్నట్లు తెలియజేశారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో జూట్‌ మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.     

120 టన్నులు.. 
హౌరా జిల్లాలో గల రెండు యూనిట్లకు సమీపాన రోజుకి 90 టన్నుల సామర్థ్యంతో కొత్త మిల్లును ఏర్పాటు చేస్తున్నట్లు బంగూర్‌ పేర్కొన్నారు. 2022 డిసెంబర్‌కల్లా బెంగాల్‌ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో రోజుకి 120 టన్నుల సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 2023కల్లా ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే వీలున్నట్లు అంచనా వేశారు. 

లాభదాయక ప్రోత్సాహకాలు, హామీగల మార్కెట్‌ తదితరాలను తెలంగాణ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలియజేశారు. రానున్న రెండు దశాబ్దాలపాటు ఉత్పత్తిని ప్రభుత్వం తిరిగి కొనుగోలు(బైబ్యాక్‌) చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ముడిసరుకుల లభ్యతకు వీలుగా ప్రభుత్వం జూట్‌ సేద్యం అభివద్ధికి మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు