జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రూ. 1,150 కోట్ల సమీకరణ

15 Dec, 2022 06:25 IST|Sakshi

రూ. 1,150 కోట్ల సమీకరణ

బీఎస్‌ఈలో ఎన్‌సీడీల లిస్టింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) రూ. 1,150 కోట్లు సమీకరించింది. ఈ ఎన్‌సీడీలను బీఎస్‌ఈలో లిస్ట్‌ చేయ నున్నట్లు సంస్థ తెలిపింది. వీటిపై తొలి అయిదేళ్ల పాటు వార్షికంగా వడ్డీ రేటు 8.805 శాతంగా ఉంటుందని, ఆ తర్వాత మరో అయిదేళ్ల వ్యవధికి సంబంధించి మార్పులు ఉంటాయని పేర్కొంది.

2024, 2026లో మెచ్యూర్‌ అయ్యే కొన్ని ఈసీబీ (విదేశీ వాణిజ్య రుణాల) బాండ్లను పాక్షికంగా చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. జీహెచ్‌ఐఏఎల్‌ దేశీ డెట్‌ మార్కెట్లో నిర్వహించిన తొలి లిస్టెడ్‌ లావాదేవీకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని జీఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ చైర్మన్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ తెలిపారు. తమ గ్రూప్‌పై మదుపుదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు