జీఎంఆర్‌కు స్టాక్‌ ఎక్స్ఛేంజీల అనుమతి

21 Dec, 2020 16:41 IST|Sakshi

వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రత్యేక కంపెనీగా ఎయిర్‌పోర్ట్‌యేతర బిజినెస్‌

ఇతర గ్రూప్ కంపెనీల విలీనం, సర్దుబాట్లకు ఓకే

ముంబై, సాక్షి: మౌలిక రంగ హైదరాబాద్‌ దిగ్గజం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రణాళికలకు స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కోసం చేసిన ప్రతిపాదనలకు ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్లు జీఎంఆర్ తాజాగా వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాశ్రయేతర బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపట్ల ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఎక్స్ఛేంజీలు  పేర్కొన్నట్లు జీఎంఆర్‌ తెలియజేసింది. దీంతో ఈ ప్రతిపాదనలపై ఆరు నెలల్లోగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదనల్లో భాగంగా కంపెనీ జీఎంఆర్‌ పవర్‌ ఇన్‌ఫ్రా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా తదితరాకు సంబంధించి విలీనం, సర్దుబాట్లు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో కంపెనీ వ్యూహాత్మక రీస్ట్రక్చరింగ్‌ ప్రణాళికలకు తెరతీసిన విషయం విదితమే. కాగా.. కార్పొరేట్‌ హోల్డింగ్‌ స్ట్రక్చర్‌ను సులభతరం చేసేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్‌యేతర బిజినెస్‌ను విడదీయనున్నట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. (మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు)

మరిన్ని వార్తలు