హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఫీజుల మోత

2 Oct, 2021 03:09 IST|Sakshi

యూడీఎఫ్‌ పెంచుకోవడానికి జీఎంఆర్‌కు ఏఈఆర్‌ఏ అనుమతి

2022 ఏప్రిల్‌ 1 నుంచి పెంపు  

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు చేసేవారికి చార్జీలు మరింత భారం కానున్నాయి. యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌)ను పెంచుకునేందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) అనుమతించడం ఇందుకు కారణం. 2022 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి.

2021 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి దాకా వర్తించే మూడో కంట్రోల్‌ పీరియడ్‌కు సంబంధించి జీహెచ్‌ఐఏఎల్‌ ప్రతిపాదన ప్రకారం టారిఫ్‌లను సవరిస్తూ ఏఈఆర్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేశీ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ను రూ. 480కి (ప్రస్తుతం రూ. 281), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే దాన్ని రూ. 700కి (ప్రస్తుతం రూ. 393) పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2025 డిసెంబర్‌ 31 నాటికి దేశీ ప్రయాణికుల యూడీఎఫ్‌ రూ. 750 దాకా, విదేశీ ప్రయాణికులకు రూ. 1,500 దాకా యూడీఎఫ్‌ పెరుగుతుంది.

మరిన్ని వార్తలు