గో ఫ్యాషన్‌ ఐపీవోకు భారీ స్పందన

18 Nov, 2021 06:12 IST|Sakshi

గంటల వ్యవధిలోనే 2.46 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌

న్యూఢిల్లీ: మహిళల దుస్తుల బ్రాండ్‌ గో కలర్స్‌ మాతృ సంస్థ గో ఫ్యాషన్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీవో) భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 2.46 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) డేటా ప్రకారం 80.79 లక్షల షేర్లను ఆఫర్‌ చేస్తుండగా 1.99 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్ల (ఆర్‌ఐఐ) విభాగంలో భారీ డిమాండ్‌ కనిపించింది. ఇది 12.14 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఐపీవో ద్వారా గో ఫ్యాషన్‌ రూ. 1,013.6 కోట్లు సమీకరిస్తోంది. ఇష్యూకి షేరు ధర శ్రేణి రూ. 655–690గా ఉంది. సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని 120 ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్ల ఏర్పాటు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు మొదలైన వాటి కోసం కంపెనీ వినియోగించుకోనుంది. గో కలర్స్‌ బ్రాండ్‌ కింద మహిళలకు సంబంధించిన చుడీదార్లు, లెగ్గింగ్‌లు మొదలైన వాటిని గో ఫ్యాషన్‌ విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు