అమ్మకాల్లో 20 శాతం వృద్ధి 2023-24పై గోద్రెజ్ అప్లయన్సెస్‌

17 Feb, 2023 15:48 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు 20 శాతం పెరిగి రూ. 6,200 కోట్లకు చేరగలవని గోద్రెజ్‌ అప్లయన్సెస్‌ అంచనా వేస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల వాటా ప్రస్తుతమున్న 35 శాతం నుంచి 40 శాతానికి పెరగగలదని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు రూ. 5,200 కోట్లుగా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు సంస్థ బిజినెస్‌ హెడ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది చెప్పారు.

ఏసీల విభాగం అమ్మకాలు రెండింతలు పెరిగి రూ. 1,200 కోట్లకు చేరగలవని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కంపెనీ అమ్మకాల్లో ఏసీల వాటా 15 శాతంగా ఉండగా ఇది 22 శాతానికి చేరవచ్చని నంది చెప్పారు. కొత్తగా లీక్‌ ప్రూఫ్‌ ఎయిర్‌ కండీషనర్‌లను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ. 48,900గా ఉంటుంది. ఈ వేసవిలో  కూలింగ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

చైనా నుంచి సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా మటుకు విడిభాగాలు, పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవడం పెరుగుతోందని నంది వివరించారు.

మరిన్ని వార్తలు