న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 359 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,144 కోట్ల నుంచి 7 శాతం పుంజుకుని రూ. 3,364 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 14 శాతంపైగా పెరిగి రూ. 2,951 కోట్లను దాటాయి. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,985 కోట్లను తాకింది. ఇండోనేసియా నుంచి 8 శాతం అధికంగా రూ. 409 కోట్ల టర్నోవర్ సాధించింది.