ఎంసీఎక్స్లో బంగారం ధర రూ. 199 ప్లస్
అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 54,988కు
రూ. 910 జంప్చేసిన కేజీ వెండి ధర
రూ. 75,070 వద్ద ట్రేడవుతున్న సెప్టెంబర్ ఫ్యూచర్స్
న్యూయార్క్ కామెక్స్లో పసిడి 0.5 శాతం అప్-2039 డాలర్లకు
వెండి ఔన్స్ 0.6 శాతం లాభంతో 28.14 డాలర్లకు
వారాంతాన భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు నేటి ట్రేడింగ్లో రికవర్ అయ్యాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాముల ధర రూ. 199 పుంజుకుని రూ. 54,988కు చేరింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ రూ. 910 ఎగసి రూ. 75,070 వద్ద వద్ద ట్రేడవుతోంది. గడిచిన శుక్రవారం తొలుత సరికొత్త గరిష్ట రికార్డులకు చేరిన బంగారం, వెండి ధరలు మిడ్సెషన్ నుంచీ పెరిగిన భారీ అమ్మకాలతో ఒక్కసారిగా డీలాపడిన సంగతి తెలిసిందే. పసిడి గరిష్టంగా రూ. 56,191ను తాకగా.. వెండి రూ. 77,949కు చేరింది. తద్వారా వారాంతాన ఇంట్రాడేలో బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్ చరిత్రలో సరికొత్త గరిష్టాలను సాధించాయి.
కామెక్స్లోనూ
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 11 డాలర్లు(0.5 శాతం) బలపడి 2,039 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం 6 డాలర్లు క్షీణించి 2,029 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. రికార్డ్ ర్యాలీని కొనసాగిస్తూ శుక్రవారం ఉదయం పసిడి 2,089 డాలర్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకున్న విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం వెండి సైతం 0.6 శాతం లాభపడి 28.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.