ముంబై : కొద్దిరోజులుగా కొండెక్కిన బంగారం ధరలు గురువారం దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 404 రూపాయలు తగ్గి 51,420 రూపాయలకు పడిపోయింది. ఇక కిలో వెండి 878 రూపాయలు పతనమై 67,903 రూపాయలు పలికింది. ఇక అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను మరికొంత కాలం సున్నా స్ధాయిలో కొనసాగిస్తామని విధాన ప్రకటనలో స్పష్టం చేసిన అనంతరం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
డాలర్ స్ధిరంగా కొనసాగడం కూడా పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ తగ్గింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం అధికం కానుందని ఫెడ్ అంచనా వేసింది. నిరుద్యోగ రేటు తాము ఊహించినదాని కంటే అధికంగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఫెడ్ నిర్ణయాలు మిశ్రమంగా ఉన్నా బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరచకపోవడంతో స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.3 శాతం తగ్గి 1954 డాలర్లకు పడిపోయింది. చదవండి : మళ్లీ కొండెక్కిన బంగారం