6.4 శాతం పెరుగుదలతో
13 బిలియన్ డాలర్లకు జంప్
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి నాలుగు నెలల కాలంలో (ఏప్రిల్-జూలై) 6.4 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అయితే ఒక్క జూలై నెలను తీసుకుంటే మాత్రం దిగుమతులు భారీగా 43.6 శాతం పడిపోయి 2.4 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. (Radhakishan Damani: ఝున్ఝున్వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!)
ఎగుమతులు-దిగుమతుల విలువకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు భారీగా పెరిగిపోవడంలో క్రూడ్తో పాటు పసిడి కూడా ప్రధాన కారణంగా ఉంటోంది. 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) వాణిజ్య లోటు దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది. (Today Stockmarket Closing: సెన్సెక్స్ 872 పాయింట్లు ఢమాల్)
ఆభరణ పరిశ్రమ ఎగుమతులు ఊరట:
చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు భారత్. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ నుంచి పసిడి డిమాండ్ అధికంగా ఉంది. అయితే దేశం నుంచి రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ఎగుమతులు పటిష్టంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెల్లో రత్నాలు, ఆభరణాల పరిశ్రమల ఎగుమతులు 7 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 13.5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.