Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!

13 Mar, 2022 18:49 IST|Sakshi

దేశ కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)పై ప్రభావం చూపే భారతదేశ బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో సుమారు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో(ఏప్రిల్-ఫిబ్రవరి 2021లో) ఈ దిగుమతులు విలువ 26.11 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2022లో విలువైన లోహం దిగుమతులు 11.45 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత 11 నెలల కాలంలో బంగారం దిగుమతుల పెరగడంతో వాణిజ్య లోటు 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు దిగుమతిదారుగా ఉంది. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ నుంచి ఎక్కువ డిమాండ్ రావడంతో దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో రత్నాలు & ఆభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు 9.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటుపై మరింత ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. 

(చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..!)

మరిన్ని వార్తలు