మూత పడుతున్న బ్యాంకులు.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా

13 Mar, 2023 19:20 IST|Sakshi

జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు స్టాక్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ ప్రభావంతో మదుపర్లు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఇటీవలే తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి.

అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ తోపాటు సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేత, అమెరికా డాలర్‌ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్‌ రేట్ల పెంపు వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ నివేదిక చెబుతుంది.

ఇక తాజాగా మార్చి 13న ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 970 పెరిగి రూ. 56,550కి చేరింది. విదేశీ మార్కెట్లలో బంగారం ఔన్స్‌కు 1,875 డాలర్లు, వెండి 20.75 వద్ద ట్రేడ్‌ జరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.

ఈ సందర్భంగా యూఎస్‌ ఎకమిక్‌ డేటా పాజిటివ్‌గా రావడం, డాలర్‌లో పతనం, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద అమెరికా బ్యాంక్ వైఫల్యం కారణంగా బంగారం ధరలు ఐదు వారాల కంటే అత్యధికంగా పెరిగాయి. పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నారు. ఈ కారణం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కమోడిటీ రీసెర్చ్ నవనీత్ దమానీ చెప్పారు.

మరిన్ని వార్తలు