బంగారం కొనుగోలుదారులకు శుభవార్త!

9 Aug, 2021 14:59 IST|Sakshi

బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. నేడు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పసిడి ధర నెల చూపులు చూస్తుంది. న్యూఢిల్లీ బులియన్ జ్యూవెలరీ మార్కెట్లో ఆగస్టు 6న రూ.47,731లుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నేడు 1,175 రూపాయలు పడిపోయి రూ.46,556 చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.43,722 నుంచి రూ.42,645 పడిపోయింది. ‎ప్రపంచ మార్కెట్లలో కూడా ‎‎బంగారం రేట్లు‎‎ నేడు 4.4% వరకు పడిపోయాయి, ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే వేగంగా పెరగడం, గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,830 నుంచి రూ.530 పడిపోయి రూ.47,300కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹43,840 నుంచి 490 రూపాయలు క్షీణించి ₹43,350 చేరుకుంది. బంగరం స్థాయిలోనే వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,990 నుంచి రూ.64,025 చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

మరిన్ని వార్తలు