ఇకపై షేర్లను మించి పసిడి మెరుస్తుంది!

21 Nov, 2020 10:57 IST|Sakshi

సుప్రసిద్ధ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్ అంచనాలు

భవిష్యత్ లోనూ మరిన్ని పెట్టుబడులకు చాన్స్

డాలరు ఇండెక్స్ బలహీనపడే అవకాశం

గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ తాజా నివేదికలో మార్క్

ఈ ఏడాది పసిడి 26 శాతం, వెండి 33 శాతం అప్

న్యూయార్క్: గత ఆరు నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న బంగారం ధరలు సమీప భవిష్యత్లోనూ మరింతగా మెరుస్తాయంటున్నారు సుప్రసిద్ధ స్విస్ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్. రెండు దశాబ్దాల క్రితం చమురు, ఇతర కమోడిటీలలో బుల్ రన్ రానుందంటూ ఖచ్చితమైన అంచనాలను ప్రకటించడంతో ఫేబర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులయ్యారు. కాగా.. ఇటీవల జోరు చూపుతున్న పసిడి ధరలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఫేబర్ రూపొందించే గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ తాజా నివేదిక ఊహిస్తోంది. నివేదికలో వివరాలు చూద్దాం..

ఈక్విటీలను మించి..
2011- 2015 మధ్య కరెక్షన్ల తదుపరి 2015 డిసెంబర్ నుంచీ బంగారం ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ పసిడి ధరలు డాలర్లలో చూస్తే 26 శాతం లాభపడ్డాయి. వెండి ధరలు మరింత అధికంగా 33 శాతం జంప్ చేశాయి. ఇందుకు ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు కారణమవుతున్నాయి. యూఎస్ ఫెడ్ అనేకాకుండా యూరోపియన్ కేంద్ర బ్యాంకులు సైతం చౌక వడ్డీ రేట్లతో నిధులను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. ఇవన్నీ పసిడి, వెండి ధరలకు జోష్ నిస్తున్నాయి. వెరసి కరెన్సీ విలువలు క్షీణించనున్నాయి. ఇది జరిగితే పసిడి ధరలు రాకెట్లా పరుగు తీస్తాయి. ఇటీవల పలు కేంద్ర బ్యాంకులు పసిడిలో కొనుగోళ్లను చేపడుతూ వస్తున్నాయి. ఈ అంశాలు ఇటీవల పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

నమ్మకమైన పెట్టుబడి
సమీప భవిష్యత్ లోనూ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు, కేంద్ర బ్యాంకులు బంగారంలో పెట్టుబడులను కొనసాగించే వీలుంది. యూఎస్ డాలరు భారీగా క్షీణించవచ్చని అంచనా వేస్తున్నాం. బంగారు ఆభరణాలకు సైతం కొంతమేర డిమాండ్ పెరిగే అవకాశముంది. ఈక్విటీలు, రుణ సాధనాలతో పోలిస్తే బంగారం మంచి రిటర్నులు ఇవ్వనుంది. 2000, 2015లలో కొద్ది సమయాలలో మినహాయిస్తే.. బంగారం, వెండి 2015 నుంచి భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాది పలు అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే పసిడి మంచి పురోగతిని సాధించింది. పసిడితో పోలిస్తే ఇకపై వెండి, ప్లాటినం మరింత లాభపడేందుకు అవకాశముంది. వీటిలో ప్లాటినం మరింత బలపడవచ్చు.

మరిన్ని వార్తలు