బంగారం, వెండి.. మహాపతనం

12 Aug, 2020 09:25 IST|Sakshi

ఎంసీఎక్స్‌లో రెండు రోజుల్లో పసిడి రూ. 4456 డౌన్‌ 

మరింత అధికంగా రూ. 13,356 కుప్పకూలిన వెండి కేజీ ధర

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,490కు

కేజీ వెండి రూ. 62,038 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,905 డాలర్లకు

స్పాట్‌ మార్కెట్లోనూ ఔన్స్‌ 1,894 డాలర్ల వద్ద ట్రేడింగ్‌

24 డాలర్ల దిగువకు ఔన్స్‌ వెండి ధర

ముందురోజు మహాపతనాన్ని చవిచూసిన బంగారం, వెండి ధరలు మరోసారి క్షీణపథంలో పయనిస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లో ఉన్నట్టుండి మంగళవారంం భారీగా పడిపోయిన ధరలు నేటి ట్రేడింగ్‌లోనూ అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1439(2.8 శాతం) క్షీణించి రూ. 50,490కు చేరింది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌  రూ. 4,896 తగ్గి రూ. 62,038 వద్ద వద్ద ట్రేడవుతోంది. 

మంగళవారమిలా..
మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 3,017 పతనమై రూ. 51,929కు చేరింది. వెరసి అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర 6 శాతం క్షీణించగా.. వెండి కేజీ ధర మరింత అధికంగా రూ. 8,460 పడిపోయి రూ. 66,934 వద్ద వద్ద ముగిసింది. ఫలితంగా సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ వెండి 12 శాతం కుప్పకూలింది. గత వారాంతాన తొలుత బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌ చరిత్రలో సరికొత్త గరిష్టాలను సాధించగా.. చివర్లో తోకముడిచిన సంగతి తెలిసిందే. 

కామెక్స్‌లోనూ
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 41 డాలర్లు(2.2 శాతం) దిగజారి 1,905 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 18 డాలర్లు తక్కువగా 1,894 డాలర్లకు చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 7.5 శాతం పడిపోయి 24.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

2013 తదుపరి
మంగళవారం గత ఏడేళ్లలోలేని విధంగా న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం ఫ్యూచర్స్‌ 4.6 శాతం(93 డాలర్లు) పతనమై 1,946 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్‌ మార్కెట్లో 4.2 శాతం తిరోగమించి 1912 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇక వెండి 11 శాతం పడిపోయి 26.04 డాలర్ల వద్ద ముగిసింది. ఇంతక్రితం 2013 ఏప్రిల్‌లో మాత్రమే ధరలు ఈ స్థాయిలో క్షీణించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కోవిడ్‌కు రష్యా వ్యాక్సిన్‌ను ప్రకటించడం, జులైలో ధరలతోపాటు.. డాలరు బలపడటం, 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఆరు పాయింట్లు పుంజుకోవడం వంటి అంశాలు పసిడి ధరలకు చెక్‌ పెట్టినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గత మూడు వారాలలోనే పసిడి ధరలు 14 శాతం ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో బంగారం ధరలు డీలాపడినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు