భారత్‌లో టెస్లా కార్ల తయారీకి మంచి అవకాశం: గడ్కరీ

16 Apr, 2021 14:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భారత్‌లో విద్యుత్‌ కార్ల తయారీ ప్రారంభించేందుకు అమెరికన్‌ దిగ్గజం టెస్లా ముందు బంగారం లాంటి అవకాశం ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల నుంచి వివిధ విడిభాగాలను కొనుగోలు చేస్తున్న టెస్లా.. ఇక్కడే బేస్‌ కూడా ఏర్పాటు చేసుకుంటే కంపెనీకి ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉండగలదని రైసినా డైలాగ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.  

టెస్లా సంస్థ స్వంతంగా పారిశ్రామిక ప్లాంట్ నిర్మించడం వల్ల ఇక్కడ నుంచి ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అని అన్నారు. భారతదేశంలో కార్ల తయారీకి ముందుకు వస్తే వారికి మద్దతు కూడా ఇస్తాము అని ఆయన అన్నారు. టెస్లా మోటార్స్ ఇండియా జనవరి 8న టెస్లా ఆర్ & డి విభాగాన్ని బెంగళూరులో నెలకొల్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ సంస్థకు డైరెక్టర్ లలో ఒకరిగా డేవిడ్ ఫెనిస్టియన్ పేరును కూడా తెలిపింది. అలాగే, దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, దక్షిణాదిన టెక్ సిటీ అయిన బెంగళూరులో షోరూమ్‌లు & సర్వీస్‌ సెంటర్లు తెరిచేందుకు టెస్లా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. 

చదవండి: 

ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు!

మరిన్ని వార్తలు