వర్క్‌ఫ్రం హోంపై గూగుల్‌ కీలక నిర్ణయం..

8 Aug, 2021 14:44 IST|Sakshi

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే విషయంలో గూగుల్‌ మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. ఒకేసారి ఆఫీసుకు వచ్చి పని చేయడానికి బదులు.. ఇళ్లు, ఆఫీసుల నుంచి ఉద్యోగులు పని చేసే హైబ్రిడ్‌ విధానానికి ఓకే చెప్పింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆఫీసు వర్క్‌పై నిర్ణయం తీసుకోనుంది. కోవిడ్‌ అనంతర పని విధానంపై  ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడా కంపెనీలు ఏడాదిన్నరగా వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తున్నాయి. అయితే సెప్టెంబరు నుంచి ఆఫీసుకు రావాలంటూ గూగుల్‌ తన ఉద్యోగులను కోరింది. సుమారు 10,000ల మందికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడంపై స్పందించారు. ఇందులో ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసే అవకాశం కల్పించాలంటూ 8500 మంది మంది ఉద్యోగులు గూగుల్‌ను కోరారు. వీరిలో కొందరు తమను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సిందిగా అభ్యర్థించారు. కొద్దిమంది వర్క్‌ప్లేస్‌లో  ఎక్వీప్‌మెంట్‌ మార్చితేనే ఆఫీస్‌కి వచ్చేందుకు సిద్ధమంటూ తెలిపారు.

ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఇళ్లు, ఆఫీసుల నుంచి హైబ్రిడ్‌ పద్దతిలో పని చేసుకునేందుకు గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసింది. అదే విధంగా ఉద్యోగులు కోరినట్టుగా కొందరిని రీలోకేట్‌ చేసేందుకు సైతం అనుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. ఇక ఎక్వీప్‌మెంట్‌ మార్చాలంటూ చేసిన విజ్ఞప్తిని గూగుల్‌ తోసిపుచ్చింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌లో కథనం ప్రచురితమైంది.  

స్టాటిస్టా నివేదిక ప్రకారం గూగుల్‌ ఉద్యోగుల్లో  55 శాతం మంది తమ ఆఫీస్‌లను మార్చాలని కోరితే, మిగిలిన 45 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తామన్నారు. దీనిపై గూగుల్‌ ప్రతినిధి స్పందిస్తూ... ఉద్యోగుల అవసరాల్ని తీర్చగలమా? లేదా? అందుకు ఆఫీస్‌ రూల్స్‌ ఎలా ఉన్నాయి. దీనికి  సంబంధించిన వివరాల గురించి తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పుడే అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగులకు కావాల్సిన విధంగా ఆఫీస్‌ వాతావరణాన్ని మారుస్తాం. సాధ్యంకాని చోట ఉద్యోగుల అభ్యర్థనలు తిరస్కరిస్తామని తెలిపారు.  
 

మరిన్ని వార్తలు