వెనక్కు తగ్గిన గూగుల్‌.. యూజర్లు డిఫాల్ట్‌ సెర్చి ఇంజిన్‌ ఎంచుకోవచ్చు

27 Jan, 2023 17:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌కి సంబంధించి గుత్తాధిపత్యం కేసులో కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) విధించిన జరిమానాపై ఊరట లభించకపోవడంతో టెక్‌ దిగ్గజం గూగుల్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో డిఫాల్ట్‌ సెర్చి ఇంజిన్‌ను ఎంచుకోవడానికి భారత యూజర్లకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయ బిల్లింగ్‌ సిస్టమ్‌ను కూడా ఎంచుకునే ఆప్షన్‌ కూడా వచ్చే నెల నుంచి కల్పించనున్నట్లు పేర్కొంది.

స్థానిక చట్టాలకు కట్టుబడి వ్యవహరించడానికి తాము కట్టుబడి ఉన్నామని గూగుల్‌ స్పష్టం చేసింది. గూగుల్‌ తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలకు లైసెన్సుకు ఇస్తుంది. అయితే, తన సొంత యాప్స్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేయాలనే షరతు కూడా విధిస్తుంటుంది. ఇలాంటి ధోరణులు పోటీ సంస్థలను దెబ్బతీయడమే అవుతుందంటూ సీసీఐ ఆండ్రాయిడ్‌ కేసులో రూ. 1,338 కోట్లు, ప్లే స్టోర్‌ కేసులో రూ. 936 కోట్లు గూగుల్‌కు జరిమానా విధించింది. వీటిపై స్టే విధించాలంటూ గూగుల్‌ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఊరట లభించలేదు.

చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!

మరిన్ని వార్తలు