ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. గూగుల్‌ కీలక నిర్ణయం

21 Apr, 2022 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ తగలనుంది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్​లో కాల్​ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్​ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, మీ ఫోన్‌లో వాయిస్ కాల్​ మాట్లాడుతున్నప్పుడు, ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్​ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్‌ రికార్డు చేస్తున్నారనే అలర్ట్‌ వస్తుంది. 

ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్​కు గగుల్‌ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్​ను తొలగించేందుకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు