ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్కు యూరోపియన్ యూనియన్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్పై 2.42 బిలియన్ యూరోల జరిమానా విధిస్తూ యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గూగుల్ చేసిన అభ్యర్థనను యూరోపియన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గూగుల్పై జరిమానా సరైందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసలు విషయానికి వస్తే.. 2017లో పోటీదారులకు హాని కలిగించేలా సందర్శకులను దాని స్వంత షాపింగ్ సర్వీసుకు అనుకూలంగా వ్యవహరించడం కోసం గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ గూగుల్పై 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది.
అయితే, ఈ జరిమానాను వ్యతిరేకిస్తూ యూరోపియన్ కమిషన్ జనరల్ కోర్టులో గూగుల్ అప్పీల్ చేసింది. గూగుల్ చేసుకున్న ఈ అప్పీల్ను కోర్టు తోసిపుచ్చడంతో పాటు జరిమానాను సమర్థించింది. యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా 2017లో మార్పులు చేసినట్లు గూగుల్ తెలిపింది. "మా కొత్త విధానం మూడు సంవత్సరాలకు పైగా విజయవంతంగా పనిచేసినట్లు" గూగుల్ ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఖండంలో ఆన్లైన్ దిగ్గజం ప్రాబల్యాన్ని అరికట్టడానికి యూరోపియన్ రెగ్యులేటర్లు చేసిన ప్రయత్నంలో ఈ జరిమానా భాగం. ఆ తర్వాత గూగుల్పై మరో రెండు యాంటీట్రస్ట్ పెనాల్టీలు విధించాయి. మొత్తం 8.25 బిలియన్ యూరోల($9.5 బిలియన్)కు సంబంధించి కంపెనీ కూడా అప్పీల్ చేసుకుంది.