Google: ఈ ఫోన్లలో జీమెయిల్‌, యూట్యూబ్‌ పనిచేయవు..!

31 Jul, 2021 20:15 IST|Sakshi

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌ను కల్గి ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గూగుల్‌ అకౌంట్లలోకి సైన్‌ ఇన్‌ అవ్వకుండా మద్దతును గూగుల్‌ ఉపసంహరించుకోనుంది.  2.3.7 వర్షన్‌ లేదా అంతకంటే తక్కువ వర్షన్‌తో నడుస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సైన్ ఇన్‌లకు గూగుల్‌ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. గూగుల్‌ తీసుకున్న నిర్ణయం 2021 సెప్టెంబర్ 27 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.

తాజాగా 2.3.7 కంటే తక్కువ వర్షన్‌ వాడుతున్న యూజర్లకు గూగుల్‌ సంబంధిత ఈ-మెయిల్‌ను పంపింది. 2.3.7 వర్షన్‌ను వాడుతున్న యూజర్లను కనీసం ఆండ్రాయిడ్‌ 3.0 హనీకోంబ్‌ వోఎస్‌కు తమ స్మార్ట్‌ఫోన్లను ఆప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఒక వేళ అప్‌డేట్‌ చేయకపోతే జీమెయిల్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ డ్రైవ్‌, యూట్యూబ్‌, ఇతర గూగుల్‌ సేవలను యాప్‌ల ద్వారా పొందలేరని పేర్కొంది. వీటిని ఫోన్‌ బ్రౌజర్లో యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు గూగుల్‌ పేర్కొంది. 

ఈ కాలంలో ఆండ్రాయిడ్‌ 3.0 వర్షన్‌ దాని కంటే తక్కువ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌  అతి తక్కువ మంది యూజర్లు వాడుతున్నారని గూగుల్‌ పేర్కొంది. యూజర్ల భద్రత, డేటాను దృష్టిలో ఉంచుకొని గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  సెప్టెంబర్‌ 27 నుంచి ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.7 ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఆయా గూగుల్‌ యాప్స్‌లో లాగిన్‌ అవ్వడానికి ప్రయత్నిస్తే  యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఏర్రర్‌ వస్తుందని గూగుల్‌ పేర్కొంది. యూజర్ల సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయమని లేదా ఫోన్‌లను మార్చమని గూగుల్‌ ప్రోత్సహిస్తుంది. గూగుల్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్‌ వర్షన్‌ను కల్గి ఉన్న స్మార్ట్‌ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్‌ చేయాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు