టెక్స్‌ టైల్‌ ఎగుమతిదారులకు ఊరట

14 Aug, 2021 09:41 IST|Sakshi

న్యూఢిల్లీ: జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ  కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ (రిబేట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ అండ్‌ లెవీస్‌) స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. జూలై 14న కేంద్ర క్యాబినెట్‌ ఈ పథకం పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్‌ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. 

అంతర్జాతీయ పోటీకి దీటుగా... 
అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్‌ ఏ శక్తివేల్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని పేర్కొన్నారు.  స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని  ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోగాభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్‌ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని అభిప్రాయపడ్డారు

మరిన్ని వార్తలు