టోల్‌ప్లాజా, ఫాస్టాగ్‌ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

24 Mar, 2023 19:16 IST|Sakshi

టోల్‌ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టోల్‌ వసూళ్లపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రానున్న ఆరునెలల్లో దేశంలోని అన్నీ టోల్‌ ప్లాజాల వద్ద..జీపీఎస్‌ టోల్‌ కలెక్షన్‌ (GPS-based toll collection) సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు గడ్కరీ చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ (cii) నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. కొత్త టోల్‌ కలెక్షన్‌ ద్వారా టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో పాటు.. వాహనదారులు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఖచ్చితమైన టోల్‌ ఛార్జీలను వసూలు చేసే అవకాశం కలగనున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ జీపీఎస్‌- ఆధారిత వ్యవస్థ ప్రైలెట్‌ ప్రాజెక్ట్‌ పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల్ని ఆపివేయకుండా.. వాహనాల నెంబర్‌ ప్లేట్లపై నంబర్లను గుర్తించే టెక్నాలజీపై పనిచేస్తోన్నట్లు తెలిపారు.    

రూ.1.40 లక్షల కోట్లకు చేరనున్న ఆదాయం 
ఇక టోల్‌ ఫీజు వసూళ్ల ద్వారా నేషనల్‌ హైవే అథారటీ ఆఫ్‌ ఇండియా (nhai)కు ఏడాదికి రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, మరో 2-3 ఏళ్లలో రూ.1.40లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు.

వేచి చూసే సమయం మరింత తగ్గుతుంది
2018-19లో టోల్‌ ప్లాజాల వద్ద వెహికల్స్‌ కనీసం 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేంది. 2020-21, 2021-22లో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌తో వాహనాలు నిలిపే సమయం 47 సెకండ్లకు తగ్గిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సీఐఐ సమావేశంలో వివరించారు.

చదవండి👉 ‘హార్ట్‌ ఎటాక్‌’ను గుర్తించే యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8పై భారీ డిస్కౌంట్లు!

మరిన్ని వార్తలు