గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ సంస్థలపై కేంద్రం ఆగ్రహం

2 Feb, 2022 16:51 IST|Sakshi

నకిలీ వార్తలను అరికట్టడంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు తగినన్ని చర్యలు చేపట్టక పోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికలలో వచ్చే నకిలీ వార్తలను తొలగించనందుకు ఇటీవల గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలతో జరిగిన సమావేశంలో కేంద్ర అధికారులు ఆ కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. జనవరి 31న జరిగిన వర్చువల్ సమావేశంలో కంపెనీలు, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మధ్య వాడి వేడిగా సంభాషణలు జరగినట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. 

అయితే, ఈ సమావేశంలో అధికారులు టెక్ కంపెనీలకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని సంబందిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం టెక్ సెక్టార్ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్, జనవరి రెండు నెలలో కేంద్రం 55 యూట్యూబ్ ఛానెల్‌లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌లను నిషేధించింది. కొన్ని ఛానెల్స్ "నకిలీ వార్తలు" లేదా "భారతదేశ వ్యతిరేక" వార్తలను ప్రోత్సహిస్తున్నాయని, పొరుగున ఉన్న పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం దేశంలో వ్యాపింప చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న దేశీయ కంటెంట్-భాగస్వామ్య వేదికలు షేర్ చాట్, కూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. గూగుల్ ఒక ప్రకటనలో ప్రభుత్వ అభ్యర్థనలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. 

"మేము స్థానిక చట్టాలకు అనుగుణంగా కంటెంట్'ను పరిమితం చేస్తాము లేదా తొలగిస్తాము" అని పేర్కొంది. స్థానిక చట్టాలకు అనుగుణంగా బలమైన కంటెంట్ మోడరేషన్ విధానాలను తమ సంస్థ కలిగి ఉన్నట్లు కూ తెలిపింది. ఈ సమావేశంలో సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్స్ తమ ప్లాట్ ఫారమ్లపై వచ్చే తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అధికారులకు తెలిపారు. నకిలీ వార్తలను స్వయం చాలకంగా తొలగించడానికి అంతర్గత మార్గదర్శకాలను సమీక్షించాలని అధికారులు గూగుల్ సంస్థకు చెప్పినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి పెద్ద సోషల్ మీడియా వేదికలు నకిలీ వార్తలను, తప్పుడు సమాచారాన్ని అరికట్టడంలో విఫలం అవుతున్నారని, ఈ కంపెనీల విషయంలో ప్రభుత్వం నిరాశ చెందిందని కొందరు అధికారులు తెలిపారు.

(చదవండి: భారత్‌లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్‌ తరహాలోనే!)

మరిన్ని వార్తలు