పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్!

28 Apr, 2021 13:59 IST|Sakshi

జీఎస్‌టీ రిటర్న్స్‌ దాఖలు ఇక సులభం

మొబైల్‌ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌తో సమర్పించేందుకు వెసులుబాటు

మే 31వరకూ అమలు

అప్పటి వరకూ డీఎస్‌సీతో పనిలేదు

సెకండ్‌వేవ్‌ సవాళ్ల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు ఇకపై డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్ (డీఎస్‌సీ)తో పనిలేకుండా, కేవలం మొబైల్‌ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌తో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్న్స్‌ ఫైల్‌ చేయవచ్చు. పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్ర బోర్డ్‌ (సీబీఐసీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు సీజీఎస్‌టీ నిబంధనలు, 2017 సవరణకు ఉద్దేశించిన సీజీఎస్‌టీ (రెండవ సవరణ) రూల్స్‌ 2021ని కేంద్రం నోటిఫై చేసినట్లు తెలిపింది. ‘‘కంపెనీల చట్టం, 2013 నిబంధనల ప్రకారం రిజిస్టరయిన వ్యక్తి  2021 ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్య ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ కోడ్‌ (ఈవీసీ) ద్వారా రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌-3బీ ఫామ్‌లో) ఫైల్‌ చేయవచ్చు.  సరఫరాల (అవుట్‌వర్డ్, ఇన్‌వర్డ్‌) వివరాలను (జీఎస్‌టీఆర్‌-1 ఫామ్‌లో) తెలుసుకోవచ్చు’’ అని సీబీఐసీ పేర్కొంది.

పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం 
నెలవారీ రిటర్న్స్‌ దాఖలు, పన్నుల చెల్లింపులకు సంబంధించి జీఎస్‌టీఆర్‌-3బీ ఫామ్‌పై సంబంధిత వ్యాపార ప్రతినిధి డిజిటల్‌ సిగ్నేచర్‌ అవసరం. స్థానిక లాక్‌డౌన్ల వల్ల కార్యాలయాలు మూసి ఉండడంతో డిజిటల్‌ సిగ్నేచర్‌ జనరేషన్, తద్వారా లావాదేవీలు క్లిష్టమైన వ్యవహారంగా మారింది. రిటర్న్స్‌ ఫైలింగ్‌లో దీనివల్ల తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాజా నిర్ణయం హర్షణీయమని ఏఎంజీఆర్‌ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజిత్‌ మోహన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టి ఫికెట్‌ను తీసుకోడానికి కార్యాలయాలను సందర్శించలేదని వందలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఇది ప్రయోజనం చేకూర్చుతుందని తెలిపారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ అభిశేక్‌ జైన్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

చదవండి:

టెకీల‌కు ఊర‌ట: వేతనంతో కూడిన సెలవులు

మరిన్ని వార్తలు