India: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే

10 Feb, 2022 11:50 IST|Sakshi

పెళ్లిళ్లు ఫంక‌్షన్లలో వీడియో షూటింగ్‌లతో ఊపందుకున్న డ్రోన్ల వినియోగం ఈ రోజు అగ్రికల్చర్‌, ట్రాన్స్‌పోర్ట్‌, మెడికల్‌, డిఫెన్స్‌ ఇలా అనేక సెక్టార్లకు విస్తరిస్తోంది. డ్రోన్ల వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో వీటిపై నియంత్రణ కట్టుదిట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఏవియేషన్‌ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డిఫెన్స్‌ వినియోగాలకు మినహాయించి మిగిలిన రంగాలకు సంబంధించి డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టఱ జనరనల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, కేంద్ర వాణిజ్య శాఖకు ఆదేశాలు అందాయి. దీని ప్రకారం ఇకపై విదేశాల్లో పూర్తిగా తయారైన డ్రోన్లు (కంప్లీట్లీ బిల్డప్‌), కంప్లీట్లీ నాకెడ్‌ డౌన్‌ (సీకేడీ),  సెమీ నాకెడ్‌ డౌన్‌ (ఎస్‌కేడీ) డ్రోన్లను దిగుమతిపై ఆంక్షలు వర్తిస్తాయి. అంటే ఇకపై అగ్రికల్చర్‌, మెడిసిన్‌, వీడియో షూటింగ్‌ వంటి అవసరాల కోసం డ్రోన్లను దిగుమతి చేసుకునే అవకాశం లేదు. అయితే వీరు దేశీయంగా తయారైన డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. 

రక్షణ అవసరాలు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు కొత్తగా అమల్లోకి వచ్చిన డ్రోన్‌ దిగుమతి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీని ప్రకారం వీరు విదేశాల నుంచి డ్రోన​‍్లు దిగుమతి చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు కేంద్రం పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇటీవల పంజాబ్‌లో పాకిస్తాన్‌ సరిహద్దులో ఓ డ్రోన్‌ అనుమానస్పదంగా రక్షణ అధికారులకు లభించింది. ఆ మరుసటి రోజే డ్రోన్ల దిగుమతిపై ఆంక్షలు వచ్చాయి. అయితే ఈ ఆంక్షల వల్ల దేశీ డ్రోన్ల తయారీ పరిశ్రమకు మేలు జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. 

మరిన్ని వార్తలు