పెట్రోల్-డీజిల్ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?

14 Sep, 2021 15:16 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో భారతీయ మంత్రిత్వ శాఖ ప్యానెల్ దేశీయంగా ఒకే రేటు కింద పన్ను విధించడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే 45వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తుల(పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఏవియేషన్ టర్బైన్)ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం, కోవిడ్-చికిత్స ఔషధాలపై పన్ను రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడగించడం, 8 మిలియన్ రిజిస్టర్డ్ సంస్థలకు ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేసే విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ చేర్చాలని జూన్ లో కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17న జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీఎస్‌టీ వ్యవస్థలో ఏదైనా మార్పు చేయాలంటే ప్యానెల్‌లోని 3/4 ప్రతినిదుల ఆమోదం అవసరం. ఈ జీఎస్‌టీ ప్యానెల్‌లో అన్ని రాష్ట్రాలు, భూభాగాల ప్రతినిధులు ఉన్నారు. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. చాలా వరకు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొని రావడాన్ని గతంలో వ్యతిరేకించాయి. (చదవండి: జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్‌కు ఆహ్వానం)

అయితే, గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకడంతో ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోకసభలో వెల్లడించింది. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అని నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేల అదే నిజమైతే! ఇది సామాన్యుడికి భారీ ఊరటే అని చెప్పుకోవాలి. నిజంగానే పెట్రోల్, డీజిల్‌ గనుక జీఎస్‌టీ పరిధిలోకి వస్తే చాలా వరకు ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు