Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!

21 Dec, 2021 15:15 IST|Sakshi

న్యూఢిల్లీ: వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌(సీబీఐసీ) తన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ కస్టమ్స్ సుంకం తగ్గింపు అనేది మార్చి 2022 వరకు వర్తిస్తుందని సీబీఐసీ తెలిపింది. సీబీఐసీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇలా.. "శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని మార్చి 31, 2022 వరకు 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించనున్నట్లు" పేర్కొంది. 

పామాయిల్‌ కొత్త రేట్లు మంగళవారం(డిసెంబర్ 21) నుంచి అమల్లోకి రానున్నాయి. భారతదేశం నవంబర్ 2020 - అక్టోబర్ 2021 మధ్య కాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వంట నూనె ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం శుద్ధి చేసిన & ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాలను ఈ సంవత్సరం అనేకసార్లు తగ్గించింది. వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతోపాటు.. రైతులకు చేయూతనిచ్చేలా రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీనికి కేంద్రమంత్రి వర్గం 2021 ఆగస్టులో ఆమోదం తెలిపింది.

(చదవండి: 5జీ స్మార్ట్‌ ఫోన్‌ పై బంపరాఫర్‌, మరికొన్ని గంటలు మాత్రమే!)

>
మరిన్ని వార్తలు