ఫార్మా క్లస్టర్స్‌కు శుభవార్త!

12 Mar, 2022 08:27 IST|Sakshi

రూ. 500 కోట్లు కేటాయింపు  

న్యూఢిల్లీ: ప్రస్తుత ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహమిచ్చే బాటలో ప్రభుత్వం రూ. 500 కోట్లతో పథకాన్ని ప్రారంభించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఆయా సంస్థల ఉత్పత్తి మెరుగు, నిలకడకు మద్దతివ్వనుంది. ఫార్మాస్యూటికల్స్, ఎరువులు, రసాయనాల శాఖ ఈ పథకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) నుంచి 2025–26వరకూ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ పటిష్టతకు వీలుగా రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలియజేసింది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన మద్దతిచ్చేందుకు పథకాన్ని ఉద్దేశించినట్లు పేర్కొంది.

ఈ పథకం ప్రస్తుత ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్‌ఎంఈలు మెరుగైన ఉత్పత్తిని సాధించడం, నాణ్యత, నిలకడను అందిపుచ్చుకోవడం తదితరాలకు దన్నుగా నిలవనున్నట్లు వివరించింది. ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం ద్వారా ఫార్మాస్యూటికల్‌ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఎస్‌ఎంఈలు, ఎంఎస్‌ఎంఈలు జాతీయ, అంతర్జాతీయ నియంత్రణా ప్రమాణాలు అందుకునే బాటలో వెచ్చించే పెట్టుబడి రుణాలపై వడ్డీ రాయితీ లేదా సబ్సిడీ అందించనున్నట్లు తెలియజేసింది.  

చదవండి: బైజూస్‌ భారీగా నిధుల సమీకరణ

మరిన్ని వార్తలు