పీఎస్‌బీ సీఈవోల పదవీకాలం పదేళ్లకు పెంపు

19 Nov, 2022 07:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సీఈవో, ఎండీల గరిష్ట పదవీకాలాన్ని 10 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిబంధనను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రతిభావంతులను పీఎస్‌బీలు వదులుకోకుండా అట్టే పెట్టుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడనుంది. ఇప్పటివరకు గరిష్ట పదవీకాలం 60 ఏళ్ల సూపర్‌ యూన్యుయేషన్‌కు లోబడి 5 సంవత్సరాలుగా ఉంది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) హోల్‌–టైమ్‌ డైరెక్టర్లకు కూడా ఇదే  వర్తిస్తోంది. ఎండీలు, హోల్‌–టైమ్‌ డైరెక్టర్లకు ప్రాథమికంగా పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుందని, రిజర్వ్‌ బ్యాంక్‌తో సంప్రదింపుల మేరకు దీన్ని గరిష్టంగా 10 ఏళ్ల వరకూ పొడిగించవచ్చని ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. పదవీకాలం ముగియడానికి ముందుగానే వారిని ఏ కారణం వల్లనైనా తొలగించాల్సి వస్తే మూడు నెలల ముందు రాతపూర్వక నోటీసులు ఇవ్వాలి. లేదా మూడు నెలల జీతభత్యాలు చెల్లించాలి.

చదవండి: అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్‌ కార్డ్‌తో బోలెడు లాభాలు!

మరిన్ని వార్తలు