ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయం షురూ

8 Oct, 2022 05:59 IST|Sakshi

బిడ్స్‌కు ఆహ్వానం పలికిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వం తాజాగా తెరతీసింది. ఎల్‌ఐసీతో కలసి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌(ఈవోఐ)కు ఆహ్వానం పలికింది. ఆసక్తి గల సంస్థలు బిడ్స్‌ దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 16 వరకూ గడువును ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ప్రభుత్వం 45.48 శాతం వాటాను కలిగి ఉంది. వెరసి సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రైవేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. వాటాలతోపాటు బ్యాంకులో యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు బిడ్స్‌కు ఆహ్వానం పలికిన దీపమ్‌ వెల్లడించింది. ఇందుకు పలు నిబంధనలు వెల్లడించింది. డీల్‌ తదుపరి సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది.

నిబంధనలివీ..: ఐడీబీఐ కొనుగోలుకి ఈవోఐ దాఖలు చేసే కంపెనీలు కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా గత ఐదేళ్లలో మూడేళ్లపాటు లాభాలు ఆర్జించిన కంపెనీకి మాత్రమే బిడ్డింగ్‌కు అర్హత లభిస్తుంది. కన్సార్షియంగా ఏర్పాటైతే నాలుగు కంపెనీలను మించడానికి అనుమతించరు. విజయవంతమైన బిడ్డర్‌ కనీసం ఐదేళ్లపాటు బ్యాంకులో 40% వాటాను తప్పనిసరిగా లాకిన్‌ చేయాలి. భారీ పారిశ్రామిక, కార్పొరేట్‌ హౌస్‌లు, వ్యక్తులను బిడ్డింగ్‌కు అనుమతించరు.

ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు 0.7 శాతం బలపడి రూ. 43 వద్ద ముగిసింది.
ఈ ధరలో 60.72 శాతం వాటాకు రూ. 27,800 కోట్లు లభించే వీలుంది.  

మరిన్ని వార్తలు