ఎల్‌ఐసీ ఐపీవోకు సలహాదారులు కావలెను

16 Jul, 2021 05:21 IST|Sakshi

మర్చంట్‌ బ్యాంకర్ల కోసం నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కు సంబంధించి మర్చంట్‌ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గరిష్టంగా పది వరకు మర్చంట్‌ బ్యాంకర్లు, ఒక న్యాయ సలహా సేవల సంస్థను ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్‌) ఎంపిక చేయనుంది. బిడ్ల దాఖలుకు ఆగస్ట్‌ 6 వరకు గడువు ఇచ్చింది. గత వారమే ఎల్‌ఐసీ ఐపీవోకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే.

2022 జనవరి–మార్చి మధ్యలో ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటివరకు కేవలం రూ.7,500 కోట్ల మేరకే సమీకరించింది. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం, ఎల్‌ఐసీ ఐపీవో రూపంలో గణనీయమైన మొత్తం సమకూరనుంది.

మరిన్ని వార్తలు