న్యూఢిల్లీ: యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు, అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) రెండో విడతను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్)లతో కలిసి ఈ రెండేళ్ల కోర్సును రూపొందించారు.
దీనిలో భాగంగా విద్యార్థులు ఇటు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతో పాటు క్షేత్ర స్థాయిలోనూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. సుశిక్షితులైన మానవ వనరులకు సంబంధించి నెలకొన్న డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్స్ను తీర్చిదిద్దడం మొదలైనవి ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాం లక్ష్యాలు. విద్య, వృత్తిపరమైన అనుభవం ఉన్న 21–30 మధ్య వయస్సు గల పురుషులు, మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.