ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం తీపికబురు!

28 Sep, 2021 21:01 IST|Sakshi

Fame 2 Scheme For Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి కేంద్రం తీపికబురు చెప్పే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్‌ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తుంది. అయితే, ఈ ఫేమ్ 2 స్కీమ్‌ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రికల్‌ వెహికల్‌ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా గతంలో కేంద్రం ఎలక్ట్రికల్‌ వెహికల్‌ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. (చదవండి: ఒక్కసారిగా పేలిన ఫోన్‌ ఛార్జర్‌...! స్పందించిన కంపెనీ...!)

ఈవీ వెహికల్స్‌ తయారీకి సంబంధించి కిలోవాట్‌ పర్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన బైక్‌ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ.15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 kWh  బైక్‌పై రూ. రూ.30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ మార్చి 31, 2022 వరకు కొనసాగనుంది.

అయితే, ఇప్పుడు ఫేమ్ 2 స్కీమ్‌ సబ్సిడీ గడువు తేదీని మార్చి 31, 2024 వరకు పొడగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించలేదు. ఇప్పటి వరకు ఈ పథకం కింద సుమారు 1,24,415 వాహన కొనుగోలుదారులు ప్రయోజనం పొందారు. ఇందులో 99,652 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాదారులు, 23,059 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాదారులు, 1,693 ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాదారులు ఉన్నారు. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ల పరంగా కర్ణాటక(25,725 ఈవీలు), తమిళనాడు (19,222 ఈవీలు), మహారాష్ట్ర (13,384 ఈవీలు), ఉత్తరప్రదేశ్(7,990 ఈవీలు), రాజస్థాన్ (10,010 ఈవీలు), ఢిల్లీ (8,897 ఈవీలు) ఈ పథకం కింద ఎక్కువగా ప్రయోజనం పొందాయి. 

మరిన్ని వార్తలు