షిప్పింగ్‌ కార్ప్‌ విక్రయానికి సిద్దమవుతున్న రంగం: త్వరలోనే బిడ్లు

31 Aug, 2022 13:34 IST|Sakshi

క్యూ4లో షిప్పింగ్‌ కార్ప్‌ విక్రయం

ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను పిలిచే చాన్స్‌

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ) ప్రయివేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకంకాని, భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న మూడు నెలల్లోగా పూర్తికావచ్చని అంచనా వేశారు.

దీంతో జనవరి-మార్చి(క్యూ4)కల్లా అర్హతగల కంపెనీల నుంచి ఫైనాన్షియల్‌ బిడ్స్‌కు ఆహ్వానం పలికే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే నెలలో కీలకంకాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్‌ హౌస్, ముంబై, మ్యారిటైమ్‌ ట్రయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్, పోవైసహా ఎస్‌సీఐ ల్యాండ్‌ అండ్‌ అసెట్స్‌ లిమిటెడ్‌(ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌)ను విడదీయనుంది. తద్వారా ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది.

మరిన్ని వార్తలు